Tuesday, April 5, 2011

Kodalu diddina kapuram (1970) - 1

పాట - 1
పల్లవి :

నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరువద్దు

జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు

చరణం : 1

సత్యం కోసం సతినే అమ్మినదెవరు?హరిశ్చంద్రుడు

తండ్రిమాటకై కానలకేగినదెవరు? శ్రీరామచంద్రుడు

అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా? లక్ష్మన్నా

పతియె దైవమని తరించి పోయినదెవరమ్మా? సీతమ్మ

ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే ధర్మం

అనుసరించుటే నీ ధర్మం

నీ ధర్మం మరువద్దు

జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు

చరణం : 2

చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న

మేడిపండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్న

వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించె కందుకూరి

తెలుగు భారతిని ప్రజల భాషలో తీరిచి దిద్దెను గురజాడ

ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం

నీవు నిలిచిన ఈ సంఘం

నీ సంఘం మరువద్దు

జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు

చరణం : 3

స్వతంత్ర భారతరథసారథియై సమరానదూకె నేతాజీ

సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపూజీ

గుండు కెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి

తెలుగు వారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవి

ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం

నీవు పుట్టిన ఈ దేశం

నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరువద్దు

జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు

మహనీయులనే మరవద్దు...


చిత్రం : కోడలు దిద్దిన కాపురం (1970)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : టి.వి.రాజు

గానం : పి.సుశీల

No comments:

Post a Comment